
కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్ గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోకి ఎలుగుబంటి ప్రవేశించి కొంతసేపు సంచరించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళలో ఇళ్ల సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు.
గట్టుబూత్కూర్ గ్రామంలోని కొందరు ఎలుగుబంటి సంచారాన్ని గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు పరిస్థితిని పరిశీలించారు. ఎలుగుబంటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలుగుబంటి గ్రామ శివారులో కొంతసేపు తిరుగుతూ కనిపించిందని, అనంతరం సమీపంలోని గుట్ట ప్రాంతం వైపు వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మళ్లీ గ్రామంలోకి వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో అడవి జంతువుల సంచారం పెరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆహారం, నీటి కోసం అడవి జంతువులు జనావాసాల వైపు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. గట్టుబూత్కూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు.
అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి అడుగుజాడలను పరిశీలించి, అవసరమైతే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు గుంపులుగా తిరగాలని, చిన్నారులను ఒంటరిగా బయటకు పంపవద్దని, ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఎలుగుబంటి వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..