
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. శివాలయం ఆలయ గర్భగుడిలో శివుడి విగ్రహం, నాగదేవత విగ్రహాల ఎదురుగా తెల్లటి శ్వేతనాగు (తెల్లని త్రాచుపాము) ప్రత్యక్షమవడంతో భక్తుల్లో ఆశ్చర్యంతో పాటు భక్తి భావం వెల్లివిరిసింది. ప్రతిరోజు మాదిరిగానే నిత్యపూజలు నిర్వహించేందుకు ఆలయ పూజారి గర్భగుడిలోకి వెళ్లగా, నాగదేవత విగ్రహాల ముందే తెల్లటి పాము ప్రశాంతంగా ఉండటాన్ని గమనించారు. తొలుత ఒక్కసారిగా ఉలిక్కిపడిన పూజారి, అనంతరం ఆ పాము ఎలాంటి హాని చేయకుండా నిశ్శబ్దంగా ఉండటంతో ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు.
శ్వేతనాగు దర్శనం విషయాన్ని తెలుసుకున్న రచ్చపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వందలాది మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి శ్వేతనాగును దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆరుద్ర నక్షత్రంలో వచ్చిన సోమవారం నాడు.. సాంబమూర్తి ఆలయంలో శ్వేతనాగు దర్శనమివ్వడంతో చాలామంది భక్తులు శుభసూచకంగా భావిస్తున్నారు. అయితే పాము ఒక అడవి జీవి కావడంతో దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దేవుడు మహిమగానే భావించి పూజలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..