Lok Sabha Election: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యుహం.. అభ్యర్థుల ఎంపికపై అదిష్టానం మేధోమథనం
లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను శరవేగంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ.. మూడు సీట్ల విషయంలో అచితూచి వ్యవహారిస్తోంది. అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గానూ 14 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచింది.
లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను శరవేగంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ.. మూడు సీట్ల విషయంలో అచితూచి వ్యవహారిస్తోంది. అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గానూ 14 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మూడు నియోజకవర్గాలకు అత్యంత కీలకమైనవని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.
ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న భావన నాయకుల్లో ఏర్పడింది. దాంతో ఆ నియోజకవర్గానికి పోటీ ఎక్కువైంది. స్థానిక బలమైన నాయకులే కాకుండా స్థానికేతర నాయకులు కూడా ఆ సీటుపై కన్నేశారు. టికెటిస్తే చాలు గెలుస్తామన్న ధీమా ఆశావహుల్లో నెలకొంది. జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కుమారుడు టికెట్ ఆశించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంత రావు వంటి వారు సైతం పోటీకి ఆసక్తి కనబర్చారు. అయితే, అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యమవుతున్న క్రమంలో పలువురు ఆశావహులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా తెరమీదికి కొత్త పేరు రావడం గమనార్హం. కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చిరకాల మిత్రుడైన మండవ వెంకటేశ్వర రావుకు టికెట్ ఇప్పించడానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్న కరీంనగర్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొని చివరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఈసారి కరీంనగర్లో ఎలాగైనా పాగా వేయాలన్న ఉత్సాహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేయడానికి అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని అగ్రనాయకులు చర్చలు జరుపుతున్నారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా వెలిశాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని తానై ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికలో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది.
హైదరాబాద్ లోక్సభ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వక బంధాన్ని నెరపాలని తెలంగాణ కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంభిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవిలత గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్న ఎంఐఎం.. బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎంకి సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లింల ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ టికెట్లు దక్కించుకునేందుకు అశావాహుల్లో మాత్రం టెన్షన్ పెరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…