Kaleshwaram Project: కాళేశ్వరంపై విచారణ స్పీడప్‌.. 2 వారాల పాటు నాన్‌స్టాప్‌ ఎంక్వైరీ..!

ఏం చేసినా ఈ నెలాఖరులోపే. కాళేశ్వరంలో అవినీతిపై అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పిలిపించడానికి.. మిగిలింది ఇంకో రెండు వారాలే. బహుశా ఈ వారంలో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయంటున్నారు. కీలక వ్యక్తులతో పాటు కీలక ప్రజాప్రతినిధులకు..

Kaleshwaram Project: కాళేశ్వరంపై విచారణ స్పీడప్‌.. 2 వారాల పాటు నాన్‌స్టాప్‌ ఎంక్వైరీ..!
Kaleswaram Project

Updated on: Aug 18, 2024 | 10:00 AM

ఏం చేసినా ఈ నెలాఖరులోపే. కాళేశ్వరంలో అవినీతిపై అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పిలిపించడానికి.. మిగిలింది ఇంకో రెండు వారాలే. బహుశా ఈ వారంలో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయంటున్నారు. కీలక వ్యక్తులతో పాటు కీలక ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు వెళ్తాయంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుందో.. వారికి కూడా సమన్లు వెళ్తాయా? వాళ్లు విచారణకు హాజరవుతారా

కాళేశ్వరం లిఫ్టుల్లో ఏమేం అక్రమాలు జరిగాయ్.. ఎంత అవినీతి జరిగింది.. నాణ్యతా లోపాలకు కారణాలేంటి, కారకులెవరు? వీటిని తేల్చేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే, కాళేశ్వరంలోని వివిధ బ్యారేజీలను కమిషన్ స్వయంగా పరిశీలించింది వచ్చింది. ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన ఇంజనీర్లను విచారించి.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణలో భాగంగా అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేట్ వ్యక్తులకు సమన్లు జారీ చేసింది. అయితే.. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తుండడంతో.. ఆలోపే విచారణను ముగించేయాలనుకుంటోంది కమిషన్. ఎంక్వైరీని స్పీడప్‌ చేయాలనే ఉద్దేశంతో శుక్రవారమే హైదరాబాద్ వచ్చిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్.. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాష్‌ను విచారించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టాలనే ఆలోచన మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర ఒప్పుకోలేదని కమిషన్‌కు వివరించారు వి.ప్రకాష్. సరిపడినంత స్టోరేజీ లేకపోవడం వల్లే తుమ్మిడిహట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదని కమిషన్‌కు స్పష్టం చేశారు. పైగా సీడబ్ల్యూసీ చెప్పినట్లు 164 టీఎంసీల్లో 64 టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టుల్లోనే ఉందన్న విషయాన్ని కూడా కమిషన్‌కు గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత 54 టీఎంసీలే ఉంటుందని అన్ని ఆధారాలు చూపించానన్నారు వి.ప్రకాష్. తెలంగాణ భవిషత్ కోసం తుమ్మిడిహట్టితో పాటు అన్ని ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్‌ రీ-డిజైన్ చేశారని కమిషన్‌ ముందు చెప్పానన్నారు. ఈనెల 26న సాక్ష్యాలతో సహా మరోసారి కమిషన్ ముందు హాజరవుతానన్నారు.

ఈ నెలాఖరులోగా రిపోర్ట్ సమర్పించేందుకు రెడీ అవుతోంది కమిషన్. అంతకంటే ముందు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ప్రజాప్రతినిధుల పాత్రపై కమిషన్‌కు అనుమానాలున్నాయి. అనుమానాల నివృత్తి కోసం.. కొందరు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలనుకుంటోంది కమిషన్. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ విషయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను విచారించిన కమిషన్.. వాళ్ల నుంచి ఇప్పటికి 50కిపైగా అఫిడవిట్లు రాబట్టింది. కానీ ఇంతవరకూ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాత్రం అఫిడవిట్ సమర్పించలేదు. ఆయనతోపాటు స్పందించని మరికొందరు అధికారులకు రేపోమాపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై నివేదిక ఇవ్వాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ చైర్మన్‌ను కోరింది. వాళ్లు కూడా రిపోర్ట్ సబ్‌మిట్‌ చేయకపోవడంతో నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అఫిడవిట్లు సమర్పించిన అధికారులను సైతం మరోసారి పిలిపించి.. క్రాస్ ఎగ్జామిన్‌ చేయనుంది కమిషన్‌. మొత్తంగా ఈ నెలాఖరు నాటికి కాళేశ్వరంపై విచారణను ముగించే లక్ష్యంతో పనిచేస్తోంది.