
తెలంగాణ రాజకీయ యవనికపై మరో రాజకీయ శక్తి ఉద్భవించనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. మేడ్చల్లోని మునీరాబాద్లో పార్టీ జెండాను ఆవిష్కరించి, తమ భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం నేటికీ సంపూర్ణంగా సాకారం కాలేదు. కేవలం అధికారం కోసం కాకుండా సర్వోదయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఈ కొత్త శక్తి ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ రాష్ట్రంలో నెంబర్వన్ స్థానానికి ఎదుగుతుందనే ధీమాను వ్యక్తం చేశారు.
తమ అత్తగారి ఇల్లయిన నిజామాబాద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నేను నిజామాబాద్ కోడలిని, తెలంగాణ బిడ్డను. ఈ మట్టికి అపారమైన శక్తి ఉంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తుంది’’ అని ఆమె అన్నారు.
తెలంగాణలో ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉండగా.. కవిత కొత్త పార్టీ పెట్టడం ఖచ్చితంగా కొత్త సమీకరణాలకు దారితీయనుంది. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్, సర్వోదయ నినాదంతో ఆమె ప్రజల్లోకి వెళ్లడం ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 25న ప్రకటించబోయే అజెండాపైనే ఇప్పుడు అందరి కళ్లు నెలకొన్నాయి.