
తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ ను నియమిస్తూ.. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న శివధర్రెడ్డి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీని నియమించింది ప్రభుత్వం.. అంతకుముందు సీవీ ఆనంద్ హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ సీపీగా పనిచేశారు.
సీవీ ఆనంద్తోపాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా పేర్లనూ ప్రభుత్వం పరిశీలించింది. ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ సీనియర్ కావడంతోనే డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం.. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ స్థానంలో 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి శిఖాగోయల్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీవీ ఆనంద్ డీజీపీగా నియమితులవడంపై అప్పుడే స్పష్టత వచ్చినట్లయింది.
సీవీ ఆనంద్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గాను పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఆనంద్ పనిచేశారు. ప్రస్తుత రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్ రాష్ట్రంలోనే ఏఎస్సీ నుంచి డీజీపీ హోదా వరకు పలు స్థానాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పవరకు అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి మాత్రమే యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీలుగా పనిచేశారు. వారిద్దరి తర్వాత తెలంగాణకు సీవీ ఆనంద్ మూడో పూర్తి కాలపు డీజీపీగా ఉండనున్నారు.