BRS Party: ఈ లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ పక్కా వ్యూహాలు.. అభ్యర్థులపై తీవ్ర కసరత్తు..

తెలంగాణలోని అన్ని పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకు మళ్లీ సీటు ఇస్తుందా లేక కొత్త వారికి అవకాశం ఇస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

BRS Party: ఈ లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ పక్కా వ్యూహాలు.. అభ్యర్థులపై తీవ్ర కసరత్తు..
Brs Party

Updated on: Jan 17, 2024 | 11:00 AM

తెలంగాణలోని అన్ని పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకు మళ్లీ సీటు ఇస్తుందా లేక కొత్త వారికి అవకాశం ఇస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది కేవలం రెండు సీట్లు మాత్రమే. అందులో మహబూబ్‎నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఓటమి నుంచి కోల్కొని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రెండు పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. 2019లో మహబూబ్ నగర్ ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములు విజయం సాధించారు. ఈ ఇద్దరు ఎంపీల మెతక వైఖరి, ఇతర కారణాలతో అటూ నియోజకవర్గంలో, ఇటూ అధిష్టానం మెప్పును సాధించడంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ప్రస్తుత ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను బరిలో దించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఆల వెంకటేశ్వర్ రెడ్డిని మహబూబ్‎నగర్ ఎంపీగా పోటీ చేయాలని అధిష్ఠానం సంప్రదించినట్లు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆల వెంకటేశ్వర్ రెడ్డి అసక్తి చూపలేదని తెలిసింది. బీఆర్ఎస్ అధిష్ఠానం పరిశీలనలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి పేర్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎంపీ రాములును మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రముఖ ప్రజాగాయకుడు, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను బరిలో దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటాలనే ప్రయత్నంలో సిట్టింగ్‌ల సీట్లు ఉంటాయా.. ఊడతాయా అంటూ గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..