
అనుక్షణం డేగ కన్ను.. చుట్టూ వందలాది మంది పోలీసులు.. సీఎం నుంచి మంత్రుల వరకు.. ఐఏఎస్ల నుంచి ఏపీఎస్ల వరకు అందరూ వచ్చిపోతుంటారు. అదంతా హై సెక్యూరిటీ జోన్.. అదే తెలంగాణ సచివాలయం.. పోలీసు అధికారులు అనునిత్యం అలర్ట్ గా ఉంటారు.. పాస్, పేషిల అనుమతి లేనిదే.. లోపలికి పోవడం అసాధ్యం.. కానీ, అలాంటి జోన్ ను దాటి ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాంలో అవలీలగా దర్జాగా లోపలికి వెళ్లాడు.. అంతేకాకుండా.. పోలీస్ యూనిఫాంలో రీల్ చేసి ఇక్కడే డ్యూటీలో ఉన్నానంటూ.. ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే ఫోన్ చేయాలంటూ సెక్రటేరియట్ నుంచి పోస్ట్ చేశాడు.. అయితే.. ఇంతకాలం అతను పోలీస్ అనుకున్నారు.. కానీ.. అతను పోలీస్ కాదు.. ఒక ఆవారా వ్యక్తి అని.. గతంలోనూ అతనిపై కేసులున్నాయని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రీల్స్ కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ నిఖిల్పై కేసు నమోదు చేశారు. పోలీస్ యూనిఫాం ధరించి సచివాలయంలో రీల్స్ చేసిన నిఖిల్.. డ్యూటీలో ఉన్నట్లు నటించి సచివాలయంలోకి వచ్చినట్లు ధృవీకరించారు. గద్వాలకు చెందిన నిఖిల్ యాదవ్.. పై పలు కేసులున్నట్లు గుర్తించారు. నిఖిల్ పై ఏపీలోనూ కేసులు ఉన్నట్టు గుర్తించారు. అయితే.. ఈ ఘటన అనంతరం పరారైన నిఖిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నకిలీ ఖాకీ డ్రెస్తో, నకిలీ ఐడి కార్డ్ ఉండటంతో.. సెక్యూరిటీ డ్యూటీ సిబ్బంది సెక్రటేరియట్లోకి అనుమతించినట్లు తెలుస్తోంది.. నకిలీ డ్రెస్ని, నకిలీ కానిస్టేబుల్ ని సెక్రటేరియట్ పోలీస్ సిబ్బంది గుర్తుకుపట్టకపోవడం సంచలనంగా మారింది.
కాగా.. వీడియో ఇన్ స్టాలో వైరల్ కావడం.. పోలీసులు కేసు నమోదు చేయడంతో నిఖిల్ రీల్ ను డిలీట్ చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిఖిల్ కోసం సైఫాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..