CM Revanth: సింఘ్వీ ఎన్నిక తెలంగాణకు ఎంతో అవసరం.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బలమైన గొంతుకైన సింఘ్వీ ఎన్నిక తెలంగాణకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth: సింఘ్వీ ఎన్నిక తెలంగాణకు ఎంతో అవసరం.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Cm Revanth Reddy, Abhishek

Updated on: Aug 19, 2024 | 10:52 AM

తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బలమైన గొంతుకైన సింఘ్వీ ఎన్నిక తెలంగాణకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని షెర్టాన్‌ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీని ఆమోదించినందుకు అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, అభిషేక్‌ మను సింఘ్వీ ఎమ్మెల్యేలు, సీనియర్‌నేతలు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపలేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. చట్టంలోని అంశాలను చట్టసభల్లో బలంగా వినిపించాల్సిన అవసరం ఉన్నదో న్యాయస్థానాల్లోనూ అంతే గట్టిగా వాదించాల్సిన అవసరం ఉన్నదన్నారు. విభజన చట్టానికి సంబంధించిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలంగాణ తరఫున గట్టిగా వాదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ నుంచి రాజ్యసభకు తనకు అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి అభిషేక్ సింఘ్వీ ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపిస్తే తెలంగాణ వాయిస్‌ను రాజ్యసభలో బలంగా వినిపిస్తానన్నారు.

తెలంగాణ వాయిస్ ను బలంగా వినిపించే గొంతుకైన అభిషేక్‌ సింఘ్వీకి పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశవరావు రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రాజ్యసభ ఉప ఎన్నిక సెప్టెంబర్ 3న జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పోటీ చేస్తున్నారు.

Follow Us