
Hyderabad: హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫుడ్ ఆఫీసర్గా నటిస్తూ హోటల్ మేనేజర్ నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. సంజీవరెడ్డి నగర్లో ఉన్న అల్మాస్ హోటల్ మేనేజర్ సయ్యద్ అలీ అషర్ జాఫరీ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 23న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఓ వ్యక్తి హోటల్కు వచ్చి తాను జీహెచ్ఎంసీ (GHMC) ఫుడ్ ఆఫీసర్నని పరిచయం చేసుకున్నాడు. హోటల్లో పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని, నోటీసులు జారీ చేస్తానని బెదిరిస్తూ రూ.10 వేల డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. యజమాని అనుమతి లేకుండా డబ్బులు ఇవ్వలేనని మేనేజర్ తొలుత నిరాకరించారు.
అయితే చర్చల అనంతరం ఆ వ్యక్తికి రూ.5 వేల నగదు ఇచ్చినట్లు తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మే 27న అదే వ్యక్తి మరోసారి హోటల్కు వచ్చి డబ్బులు డిమాండ్ చేసినట్లు మేనేజర్ వెల్లడించారు. ఈసారి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన మేనేజర్, ఏవైనా రూల్స్ అతిక్రమించిన ఉంటే నోటీసు ఇవ్వాలని చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
తర్వాత విచారణలో ఆ వ్యక్తి అసలు ఫుడ్ ఆఫీసర్ కాదని, అధికారిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిసిందని ఫిర్యాదుదారు తెలిపారు. అతడిని శ్రీనివాస్గా గుర్తించినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా సంజీవరెడ్డి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మరెవరినైనా ఇదే విధంగా మోసం చేశాడా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి