
హైదరాబాద్లోని నాగోల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. కిటికీ గ్రిల్ తొలగించి చొరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇంటి యజమానులైన ఇద్దరు దంపతులు ఇటీవలే అమెరికాలో ఉన్న కూతుర్ల దగ్గరికి వెళ్లడంతో ఇల్లు ఖాళీగా కనిపించింది. విషయం తెలుసుకొని ఖాళీగా ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు.. వెనకాల ఉన్న కిటికీ వైపు గ్రిల్ తొలగించి ఇంటిలోనికి ప్రవేశించారు. ఇంటి లోపల బీరువాలో ఉన్న 40 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న భాస్కర్ ప్రమీల దంపతులు గత నెల 17న అమెరికాలో ఉంటున్న తమ కూతుర్ల దగ్గరికి వెళ్లారు. దీంతో తమ ఇంటిని చూసుకోవాలని ప్రమీత తన తమ్ముడికి చెప్పింది. అయితే ఇంటి ఎదురింట్లో ఉండే వ్యక్తులు ప్రమీల తమ్ముడు శ్రీనివాస్కు ఫోన్ చేసి ఇంట్లో లైట్లు వెలిగి ఉన్నాయని గేట్ కూడా తెరిచి ఉందని చెప్పటంతో ఆయన ఇంటి వద్దకు వచ్చి చూశారు. శ్రీనివాస్ అక్కడికి వెళ్లి చూడగానే ఇళ్లు మొత్తం చల్లా చదరుగా పడి ఉండటంతో పాటు బీరువాలో ఉన్న 40 తులాల బంగారం మాయం అయ్యింది. దీంతో దొంగతన జరిగినట్టు గమనించిన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు
సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఇంటి వెనకాల వైపు ఉన్న కిటికీ గ్రిల్ తొలగించి లోపలకి ప్రవేశించి బంగారం మొత్తాన్ని దోచుకెళ్లినట్టు గుర్తించారు. పోయిన బంగారం విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 50 లక్షలకు పైబడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సిసి కెమెరా ఫుటేజ్ తో పాటు ఇంటి పరిసరాల్లో ఉండే వారి స్టేట్మెంట్ను సైతం పోలీసులు తీసుకుంటున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.