
హైదరాబాద్ నగరంలో ఉదయం వాకింగ్కు వెళ్లే మహిళలను, ఒంటరిగా నడిచే పాదచారులను లక్ష్యంగా చేసుకుని వరుస చైన్ స్నాచింగ్లు, మొబైల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26న చింతల్కు చెందిన శ్రీలత అనే మహిళ కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆటోలో వచ్చిన కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసుతో పాటు మొబైల్ ఫోన్ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, నేర చరిత్రల పరిశీలన ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు కేపీహెచ్బీ పరిధిలోని ఎల్లమ్మబండ సిక్క్ బస్తీలో వారిని అదుపులోకి తీసుకున్నారు. గోవింద్ సింగ్ (24), కరణ్ సింగ్ (21), హర్దీప్ సింగ్ (19)తో పాటు ఓ 17 ఏళ్ల బాలుడు ఈ గ్యాంగ్లో ఉన్నట్లు గుర్తించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తరచూ మత్తు పదార్థాలు సేవించిన అనంతరం కాలనీల్లో ఆటోరిక్షాలను దొంగిలించి నేరాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. కుత్బుల్లాపూర్, చింతల్, దుండిగల్, హెచ్ఎంటీ జంగిల్, కేపీహెచ్బీ కాలనీ ప్రాంతాల్లో మహిళలు, ఒంటరి పాదచారులనే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లు, మొబైల్ ఫోన్ దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఎదురు తిరిగిన బాధితులను బెదిరించడం, దాడులకు పాల్పడడం కూడా వీరి నేరశైలిగా పోలీసులు పేర్కొన్నారు.
అరెస్టైన నలుగురిపై ఇప్పటికే హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో దోపిడీలు, దాడులు, ఆస్తి సంబంధిత నేరాల కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసు ఛేదనలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.