
నగరంలో ఒంటరిగా వెళ్తున్న మహిళను వేధించిన ఐదుగురు నేపాల్ జాతీయులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితులు విదేశీయులు అయినప్పటికీ పోలీసులు వేగంగా స్పందించి వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఐదుగురు నేపాల్ యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఓ రాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళను అడ్డగించి వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం బాధితురాలు డయల్-100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి, కొన్ని గంటల్లోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయస్థానం వారికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. మహిళలపై వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది.
మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు రాజీ పడబోరని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న వారు చట్టాలను గౌరవించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే అద్దెకు ఇళ్లు ఇచ్చే యజమానులు కిరాయిదారుల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా ధృవీకరించాలని సూచిస్తున్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి నిందితులను చట్టం ముందు నిలబెడతామని అధికారులు తెలిపారు.