Telangana: ఓర్నీ.. పోలీసులు కూడా తొలుత టమాట లోడే అనుకున్నారు.. కానీ గుట్టు ఎలా వీడిందంటే

పైకి చూస్తే టమాటాలు ఉన్నట్లే కనిపించింది. కానీ వాటి కింద దాగి ఉన్నది చూస్తే పోలీసులు షాక్ అయ్యారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న డీసీఎం వ్యాన్‌లో పశువులను అక్రమంగా తరలిస్తున్న గ్యాంగ్‌ను భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: ఓర్నీ.. పోలీసులు కూడా తొలుత టమాట లోడే అనుకున్నారు.. కానీ గుట్టు ఎలా వీడిందంటే
Cattle Smuggling

Edited By: Ram Naramaneni

Updated on: Oct 11, 2025 | 5:15 PM

పైకి చూస్తే టమాటాలు, కానీ లోపల మాత్రం షాకింగ్ సన్నివేశం! ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఓ డీసీఎం వాహనాన్ని భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. టమాటాలు తరలిస్తున్నట్లు చూపిస్తూ, కూరగాయల ట్రేల కింద పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయి, చందనం చెక్కలు కాకుండా.. ఇప్పుడు కొత్తగా పశువుల అక్రమ రవాణా రాకెట్ ప్రారంభమైందని తెలుస్తోంది.

వాహనం లోపల ప్రత్యేకంగా కేబిన్ ఏర్పాటు చేసి, పశువుల రోదనలు బయటకు వినిపించకుండా, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ సమాచారం ఆధారంగా భద్రాచలం పోలీసులు చెక్‌పోస్ట్ వద్ద దాడి చేసి వాహనాన్ని పట్టుకున్నారు. ఆ వాహనంలో సుమారు 35 పశువులను రక్షించి, వాటిని పాల్వంచలోని గోశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వాహన డ్రైవర్‌ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ప్రాథమిక విచారణలో ఈ గ్యాంగ్ తరచూ ఇదే తరహాలో పశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం బయటపడింది. చెక్‌పోస్టుల వద్ద కంట్రోల్ తప్పించేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి