
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (రిమ్స్)లో ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాహిల్ చౌదరి (23) హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2023-24 బ్యాచ్ కు చెందిన సాహిల్ రాజస్థాన్ లోని జైపూర్ జాట్ తెగకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. రిమ్స్ బాయ్స్ హాస్టల్లో ఉండి ఎంబిబిఎస్ చదువుతున్న సాహిల్ తన హాస్టల్ గదిలో నుండి సహచర విద్యార్థులు బయటకు వెళ్లగానే ఉదయం 11 గంటలకు గదికి తలుపులు బిగించి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోని విండో కర్టెన్లను తాడుగా మల్చుకుని ఫ్యానుకు బిగించి ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది.
రూమ్లో ఫ్యాన్కు వేలాడుతున్న సాహిల్ను కిటికీలోచి చూసిన పక్కరూమ్లో విద్యార్థులు.. వెంటనే హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న హాస్టల్ సిబ్బంది సాహిల్ రూమ్ తలుపులు పగులగొట్టి.. అతన్ని కిందకు దించారు. ఇక వెంటనే అతన్ని ఎంసియుఐకి తరలించారు. అయితే అప్పటికీ సాహిల్ ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా ఆగస్టు 2 వతేదీ నుండి ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మానసిక ఒత్తిడి భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. అతని వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడు ఏం చెప్పలేమని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.