
మరో ప్రతిష్టాత్మక టోర్నీకి భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. జపాన్లోని ఐచి-నగోయా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ఏషియన్ గేమ్స్ 2026 కోసం బీసీసీఐ మహిళల జట్టును ప్రకటించింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా అత్యంత పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. సెలెక్టర్లు సీనియర్ ప్లేయర్ హర్మన్ప్రీత్ కౌర్పైనే మళ్లీ నమ్మకం ఉంచారు. ఆమెనే జట్టు కెప్టెన్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన గత ఏషియన్ గేమ్స్లో భారత్ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరుతో టైటిల్ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో జట్టు ఉంది.
ఈ ప్రతిష్టాత్మక జట్టుకు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. గాయం కారణంగా యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఫిట్నెస్పై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ, ఆమెను స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. వికెట్ కీపర్లుగా రిచా ఘోష్, జి. కమలిని జట్టులో చోటు దక్కించుకున్నారు. ‘‘సెప్టెంబర్ 2026లో జపాన్లోని ఐచి-నగోయాలో జరగబోయే ఏషియన్ గేమ్స్ కోసం ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. గత టోర్నీలో స్వర్ణ పతకం గెలిచిన భారత్, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది’’ అని బీసీసీఐ తెలిపింది.
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.