
Team India : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, అభిమానుల్లో ఒక చిన్న ఆందోళన మొదలైంది. నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో గెలిచినంత మాత్రాన అంతా సవ్యంగా ఉందని అనుకోలేం. ముఖ్యంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరగబోయే మహా సంగ్రామం ముందు భారత జట్టు లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలను గమనించిన క్రికెట్ విశ్లేషకులు.. పాక్ మ్యాచ్కు ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.
1. స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న మిడిల్ ఆర్డర్
నమీబియాపై పవర్ప్లేలో ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు మెరుపులు మెరిపించినా, మధ్య ఓవర్లలో మాత్రం భారత బ్యాటర్లు తడబడ్డారు. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విసిరిన స్పిన్ వలకు భారత ఆటగాళ్లు క్యూ కట్టారు. కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం చూస్తుంటే, స్పిన్ ఎదుర్కోవడంలో మన వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోంది. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవ్వడం, ఒత్తిడిలో వికెట్లు పారేసుకోవడం పెద్ద మైనస్. పాకిస్థాన్ దగ్గర క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి, ఈ బలహీనతను పాక్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
2. డెత్ ఓవర్లలో డెడ్ అయిన బ్యాటింగ్
ఒకానొక దశలో 16 ఓవర్లకు భారత్ 184 పరుగులు చేసి, ఈజీగా 220 మార్కును దాటుతుందనిపించింది. కానీ చివరి 4 ఓవర్లలో సీన్ రివర్స్ అయింది. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగించే విషయం. ఫినిషింగ్ రోల్లో రింకూ సింగ్, శివం దూబే వంటి ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కీలకమైన పాక్ మ్యాచ్లో చివరి ఓవర్లలో వచ్చే 10-20 పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇలాగే వికెట్లు పారేసుకుంటే మాత్రం పాక్ బౌలర్ల ముందు తలవంచక తప్పదు.
3. అర్ష్దీప్ సింగ్ ఫామ్.. కొత్త బంతి సమస్య
టీమిండియా మెయిన్ పేసర్లలో ఒకడైన అర్ష్దీప్ సింగ్, నమీబియాతో మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 3 ఓవర్లలో ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులు ఇవ్వడం జట్టును దెబ్బతీస్తోంది. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజామ్ వంటి వారిని కట్టడి చేయాలంటే కొత్త బంతితో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. బుమ్రాపైనే భారం వేయకుండా, అర్ష్దీప్ కూడా తన ఫామ్ అందుకోవాల్సి ఉంది.
సరిదిద్దుకోకుంటే ముప్పే
నమీబియాపై గెలిచి సూపర్-8లో దాదాపు బెర్త్ ఖాయం చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్తో జరిగే హై-వోల్టేజ్ పోరులో ఈ పొరపాట్లు రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో బ్యాటింగ్ ఆర్డర్ను సెట్ చేయడంతో పాటు, డెత్ ఓవర్ల వ్యూహాలను మార్చుకోవాలి. కొలంబో పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయి కాబట్టి, భారత బ్యాటర్లు మానసికంగా సిద్ధం కావాలి. మరి ఫిబ్రవరి 15న జరిగే పోరులో టీమ్ ఇండియా ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..