
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో ముంబై, అస్సాం మధ్య జరిగిన మ్యాచ్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ముంబై కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ బంతితో మెరిశాడు. పవర్ప్లేలో అస్సాం బ్యాటింగ్ లైనప్ను మడతెట్టేశాడు. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో శార్దూల్.. మొదటి మూడు ఓవర్లలోనే ముంబైని బలమైన స్థితిలో ఉంచాడు. IPL 2025కి ముందు శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్ ముంబై ఇండియన్స్కు కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. గతంలో లక్నో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శార్దూల్.. ఇప్పుడు ముంబై తరపున ఆడనున్నాడు.
220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబైకు.. ఆ జట్టు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. తన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. అస్సాం ఓపెనర్ డానిష్ దాస్ను ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ చేసి.. ఆ తర్వాత మూడో బంతికి అబ్దుల్ అజీజ్ ఖురేషిని, ఐదో బంతికి రియాన్ పరాగ్ను పెవిలియన్ పంపి అస్సాం ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. శార్దూల్ ఠాకూర్ తన రెండో ఓవర్ను కూడా ఇదే విధంగా ప్రారంభించాడు. మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు. కేవలం ఏడు బంతుల్లోనే నాలుగు వికెట్లు తీసి అస్సాంను కోలుకోలేని దెబ్బ తీశాడు. మూడో ఓవర్లో మరో బ్యాట్స్మెన్ను అవుట్ చేసి.. కేవలం 23 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు. పవర్ప్లే ముగిసే సమయానికి అస్సాం స్కోరు ఆరు వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్తో ముంబై 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. అస్సాం జట్టు 19.1 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో సాయిరాజ్ పాటిల్, అథర్వ అంకోలేకర్ చెరో రెండు వికెట్లు.. షమ్స్ ములాని ఒక వికెట్ పడగొట్టారు.