
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. పసికూనలుగా భావించే అసోసియేట్ జట్లు కూడా భారీ స్కోర్లు సాధించగలవని స్కాట్లాండ్ నిరూపించింది. సోమవారం (ఫిబ్రవరి 9) కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటలీతో జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో స్కాట్లాండ్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించి, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 200+ మార్కును దాటిన తొలి అసోసియేట్ జట్టుగా సరికొత్త రికార్డును లిఖించింది.
బంగ్లాదేశ్ స్థానంలో చివరి నిమిషంలో టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్, తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటలీతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ జార్జ్ మున్సే 54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఇటలీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరో ఓపెనర్ మైఖేల్ జోన్స్ (37)తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 126 పరుగులు జోడించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక అసోసియేట్ జట్టుకు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.
మున్సే అవుట్ అయిన తర్వాత కూడా స్కాట్లాండ్ జోరు తగ్గలేదు. బ్రెండన్ మెక్ముల్లెన్ కేవలం 18 బంతుల్లో 41 పరుగులు (నాటౌట్) చేసి ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. ఇక చివర్లో మైఖేల్ లీస్క్ ఆడిన కేమియో ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. కేవలం 5 బంతుల్లోనే 22 పరుగులు రాబట్టి స్కాట్లాండ్ స్కోరును 200 దాటించాడు. ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది జట్టుకు 207/4 భారీ స్కోరును అందించాడు. దీంతో టీ20 ప్రపంచకప్లో 200 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి టెస్టు హోదా లేని జట్టుగా స్కాట్లాండ్ రికార్డు సృష్టించింది.
గతంలో అసోసియేట్ జట్లలో అమెరికా.. కెనడాపై 197 పరుగులు చేసిన రికార్డు ఉండగా, ఇప్పుడు స్కాట్లాండ్ దానిని అధిగమించింది. అలాగే కెనడా (194), నెదర్లాండ్స్ (193) పేరిట ఉన్న రికార్డులు కూడా కనుమరుగయ్యాయి. ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సెన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. వెస్టిండీస్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిపోయిన స్కాట్లాండ్, ఈ విజయంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చి సూపర్-8 ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..