
గతంలో టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చి.. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన పృథ్వీ షాను చాలా మంది నెక్ట్స్ సచిన్ అని కొనియాడారు. సచిన్లోని టాలెంట్, సెహ్వాగ్లోని అగ్రెసివ్ ఇంటెంట్ కలిసి ఉన్న యంగ్ ప్లేయర్గా పృథ్వీ షా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. కానీ, టీమిండియాలోకి ఎంత వేగంగా వచ్చాడో అంతే స్పీడ్గా చోటు కోల్పోయాడు. చివరికి ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇక షా కెరీర్ ఖతమైందని అంతా అనుకున్నారు. ఇలా అయితే లాభం లేదు.. కెరీర్ ఫోకస్ పెట్టాలని అనుకున్నాడో ఏమో కానీ.. పృథ్వీ షా ఇటీవలె కీలక నిర్ణయం తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన హోం టీమ్ ముంబై నుంచి బయటికి వచ్చేశాడు. తాజాగా కొత్త టీమ్లో కూడా చేరాడు.
రాబోయే 2025-26 దేశవాళీ సీజన్ కోసం మహారాష్ట్ర జట్టులో చేరాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుండి షా నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందిన విషయం తెలిసిందే. ఈ మార్పు అతని కెరీర్ గాడిలో పడేందుకు సహాయపడుతుందని షా ఆశిస్తున్నాడు. 2018లో తన టెస్ట్ అరంగేట్రంలో సంచలనాత్మక సెంచరీతో ప్రారంభమైన పృథ్వీ షా కెరీర్ ఎన్నో ఆటుపోట్ల కథగా నిలిచింది. ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్ సూపర్స్టార్గా ప్రశంసలు అందుకున్న షా వరుస గాయాలు, అస్థిరమైన ఫామ్, ఫిట్నెస్పై ఆందోళనల కారణంగా అస్తవ్యస్తమైంది. ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ షా ముంబై తరఫున చివరిసారిగా ఆడిన మ్యాచ్ చిరస్మరణీయమైనది. డిసెంబర్ 14, 2024న మధ్యప్రదేశ్తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
“ఈ దశలో మహారాష్ట్ర జట్టులో చేరడం వల్ల నేను క్రికెటర్గా మరింత ఎదగడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నాకు లభించిన అవకాశాలు, మద్దతు కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్కు నేను చాలా కృతజ్ఞుతుడిని. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవలి సంవత్సరాలలో అద్భుతమైన ప్రయత్నాలు చేసింది” అని పృథ్వీ షా ఒక ప్రకటనలో తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి