
Pakistan Cricket : ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్కు మరోసారి అవమానం జరిగింది. ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చేసిన పొరపాటుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్కు సంబంధించిన టికెట్ల అమ్మకం కోసం విడుదల చేసిన ప్రచార పోస్టర్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఫోటో లేకపోవడంపై పీసీబీ తీవ్ర అసంతృప్తిగా ఉంది.
ఐసీసీ పోస్టర్ వివాదం ఏమిటి?
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ టికెట్ల అమ్మకాల కోసం ఒక ప్రచార పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఆ పోస్టర్లో కేవలం ఐదు దేశాల కెప్టెన్ల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అందులో సూర్యకుమార్ యాదవ్ (భారత్), ఐడెన్ మార్కరం (దక్షిణాఫ్రికా), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), దాసున్ షనక (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) ఉన్నారు. ఈ ఐదుగురిలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా లేకపోవడం పీసీబీకి ఆగ్రహం తెప్పించింది. తమ కెప్టెన్ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని పీసీబీ భావిస్తోంది.
ఐసీసీ వద్ద ఫిర్యాదు చేసిన పీసీబీ
ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమస్యపై పీసీబీకి సంబంధించిన విశ్వసనీయ వర్గాలు మాట్లాడుతూ..”ప్రచార పోస్టర్లో కేవలం ఐదుగురు కెప్టెన్ల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని మేము ఐసీసీ ముందు ఉంచాం” అని తెలిపారు. ఇలాంటి సమస్య గతంలో ఆసియా కప్లో కూడా ఎదురైందని, అప్పుడు బ్రాడ్కాస్టర్లు కూడా తమ కెప్టెన్ ఫోటో లేకుండానే ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆ వర్గాలు గుర్తు చేశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్తో మాట్లాడిన తర్వాతే ఆ సమస్య పరిష్కారమైందని వారు చెప్పారు.
టాప్-5లో లేకపోయినా.. ప్రాధాన్యత ఇవ్వాల్సిందే
ప్రస్తుతం పాకిస్తాన్ టీ20 ర్యాంకింగ్స్లో టాప్-5 జట్లలో లేకపోవచ్చు. అయినప్పటికీ క్రికెట్లో పాకిస్తాన్కు గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచకప్లో ఎక్కువ మంది అభిమానులను ఆకర్షించే జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. కాబట్టి, ప్రచార పోస్టర్లలో పాకిస్తాన్ కెప్టెన్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని పీసీబీ గట్టిగా నమ్ముతోంది. భవిష్యత్తులో ప్రచార పోస్టర్లలో, ఇతర ప్రచార కార్యక్రమాల్లో ఐసీసీ తమ కెప్టెన్ను తప్పకుండా చేరుస్తుందని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..