
దక్షిణాఫ్రికా ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య 2 టెస్ట్లు, 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే జరిగిన మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ సెనురాన్ ముత్తుసామి తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. భారత్ మూలాలు ఉన్న ఈ ఆల్రౌండర్ మొదటి మ్యాచ్లో 11 వికెట్లు తీసి తన సత్తా చాటుకోగా.. రెండో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో కష్టాల్లో ఉన్న తన జట్టును అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 333 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ మొదటి ఇన్నింగ్స్లో కీలకమైన ఏడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. ఇక బ్యాటింగ్కు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు పాకిస్తాన్ పేసర్ ఆసిఫ్ అఫ్రిది దెబ్బ కొట్టాడు. 79 పరుగులిచ్చి సఫారీ జట్టు కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న అతడు.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో సఫారీల జట్టు 300 పరుగులకే ఆలౌట్ అవ్వాల్సి ఉండగా.. ముత్తుసామి తన సహచర ఆటగాడు రబడాతో కలిసి పదో వికెట్కు ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ముత్తుసామి 155 బంతులు ఎదుర్కుని 8 ఫోర్లతో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. అటు రబడా 61 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. కాగా, పాకిస్తాన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుండగా.. సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ ఎలాగైనా సఫారీలు గెలిచి తీరాల్సిందే.