
Pakistan : పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంటుంది. తాజాగా పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఒక ఇంటర్వ్యూలో అతనికి ఇష్టమైన ఓపెనర్ ఎవరని అడగగా.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, సయీద్ అన్వర్ వంటి దిగ్గజాల పేర్లను కాదని, అహ్మద్ షెహజాద్ పేరు చెప్పాడు. అంతటితో ఆగకుండా దిగ్గజాల కంటే షెహజాద్ గొప్పవాడని అర్థం వచ్చేలా మాట్లాడటంతో సోషల్ మీడియాలో అతన్ని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు.
ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ కూడా తీవ్రంగా స్పందించారు. బాసిత్ అలీ అయితే ఈ వార్తను నమ్మలేకపోయాడు. “ఇది కచ్చితంగా ఫేక్ వీడియో అయ్యి ఉంటుంది. ఫర్హాన్ కు ఇంకా పిచ్చి పట్టలేదు కదా.. సచిన్ కంటే షెహజాద్ గొప్పవాడని చెప్పడానికి? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి” అంటూ చేతులు జోడించి మరీ వేడుకున్నాడు. మరో మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ నవ్వు ఆపుకోలేక.. “క్రికెటర్ అన్నాక ఏం మాట్లాడుతున్నామో కొంచెం సోయి ఉండాలి. ఐడల్ గా ఎవరినైనా అనుకోవచ్చు కానీ, సచిన్ తో పోల్చడం ఏంటి?” అంటూ ఎద్దేవా చేశాడు.
ఈ రచ్చ ఎంతవరకు వెళ్ళిందంటే, ఫర్హాన్ తరపున బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. “వాడు ఏ మైకంలో ఉండి అలా అన్నాడో.. కలిసినప్పుడు అడుగుతాను” అని బాసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, సాహిబ్జాదా ఫర్హాన్ పాక్ టీ20 జట్టులో రెగ్యులర్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో 917 పరుగులు చేశాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ ప్రాబబుల్స్ జట్టులో కూడా ఇతనికి చోటు దక్కింది. జనవరి 31 లోపు తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉండటంతో, ఇలాంటి వివాదాలు అతనికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..