
Sanju Samson : భారత యువ క్రికెటర్ సంజు శాంసన్ టీ20 జట్టుకు దూరం కానున్నాడా అనే ప్రశ్న పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆస్ట్రేలియాపై జరుగుతున్న టీ20 సిరీస్లో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అంచనా వేసినట్లుగానే సంజు శాంసన్కు చివరి రెండు మ్యాచ్లలో (నాలుగో, ఐదో టీ20) అవకాశం దక్కలేదు. మూడో టీ20లో కేవలం 2 పరుగులకే అవుట్ అయిన తర్వాత, శాంసన్ను పక్కన పెట్టడంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లైనప్పై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అంచనా వేసినట్లుగా, సంజు శాంసన్కు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20 మ్యాచ్లలో తుది జట్టులో అవకాశం దక్కలేదు. మెల్బోర్న్లో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో సంజు శాంసన్కు నంబర్-3 స్థానంలో అవకాశం ఇవ్వగా, అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ వైఫల్యం తర్వాత నుంచే సంజును జట్టు నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
సంజు శాంసన్ గతంలో ఓపెనర్గా చాలా బాగా ఆడాడు. బంగ్లాదేశ్పై సిరీస్ నుంచి ఓపెనింగ్ చేస్తున్న అతను 12 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలతో సహా 417 పరుగులు చేశాడు. కానీ, శుభ్మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో అతని బ్యాటింగ్ స్థానం తరచుగా మారుతూ వచ్చింది. ఆసియా కప్లో ఓమన్పై నంబర్-3లో 56 పరుగులు చేసినా ఆ తర్వాత తన ఫామ్ సరిగా లేదు.
బ్రిస్బేన్లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు బ్యాటింగ్ లైనప్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ పిచ్ 200 పరుగుల కోసం కాదని ఆటగాళ్లంతా అర్థం చేసుకోవాలి. గత మ్యాచ్లో మా ప్రదర్శన బాగుంది. ద్వైపాక్షిక సిరీస్ను గెలవడం ఎప్పుడూ మంచి అనుభూతిని ఇస్తుంది. మేము ఎల్లప్పుడూ మంచి కాంబినేషన్తో ముందుకు వెళ్లాలని కోరుకుంటాము. ఇది ఒక ఫార్మాట్. ఇందులో ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు మినహా మిగిలిన ఆటగాళ్లందరూ తమ బ్యాటింగ్ స్థానంలో ఫ్లెక్సిబిలిటీ చూపించాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు.
సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ ఫ్లెక్సిబిలిటీ వ్యాఖ్యలు సంజు శాంసన్ను పరోక్షంగా ఉద్దేశించినవే అని విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్, వన్డే జట్లలో చాలా కాలంగా చోటు దక్కని సంజు శాంసన్కు టీ20 జట్టు నుంచి కూడా ఉద్వాసన పలికితే, అది అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు దాదాపు ముగింపు కావచ్చునని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..