
Shreyas Iyer Fine : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు మైదానంలో ఆటతో అదరగొడుతున్నా, నిబంధనల విషయంలో మాత్రం దెబ్బతింటోంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించిన ఆనందం పంజాబ్కు ఎంతో సేపు నిలవలేదు. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు టీమ్ మొత్తానికి ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 7వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఇది రెండోసారి. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై రూ. 24 లక్షల జరిమానా విధించారు. కేవలం కెప్టెన్ మాత్రమే కాకుండా, తుది జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. మిగిలిన ప్లేయర్స్ అందరికీ రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒకే సీజన్లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధం విధించేవారు. అయితే ప్రస్తుత సీజన్ నుంచి ఈ నిబంధనలో మార్పులు వచ్చాయి. ఇకపై మూడోసారి తప్పు చేసినా కెప్టెన్పై బ్యాన్ ఉండదు, కానీ ఫీల్డింగ్ విషయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి. దీనివల్ల శ్రేయస్ అయ్యర్కు పెద్ద ఊరట లభించినట్టే. లేదంటే మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే అతను తదుపరి మ్యాచ్కు దూరం కావాల్సి వచ్చేది. పంజాబ్ యాజమాన్యం ఈ విషయంలో సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆట విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 73 పరుగులతో ఆకట్టుకోగా, శివమ్ దూబే 45 రన్స్ చేశాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ కెప్టెన్ అయ్యర్ (50), ప్రభ్సిమ్రన్ సింగ్ (43) రాణించినప్పటికీ, అసలైన విధ్వంసం మాత్రం ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ వల్లే పంజాబ్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అద్భుత ఇన్నింగ్స్కు గాను ప్రయాంశ్ ఆర్యను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. అయితే వరుసగా స్లో ఓవర్ రేట్ నమోదు కావడం జట్టు క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫీల్డ్ సెట్టింగ్లో కెప్టెన్ ఎక్కువ సమయం తీసుకోవడం, బౌలర్లతో సుదీర్ఘ చర్చలు జరపడం వల్ల ఈ సమస్య వస్తోందని తెలుస్తోంది. రాబోయే మ్యాచ్ల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా అయ్యర్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. గెలుపు జోష్లో ఉన్న అభిమానులకు ఈ జరిమానా వార్త కొంచెం నిరాశ కలిగించినా, ఆటగాళ్లు ఫామ్లో ఉండటం ప్లస్ పాయింట్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..