IPL 2026 : 11 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఎవరితడు ? కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు

IPL 2026 : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది.400లకు పైగా పరుగులు నమోదైన ఈ హై-వోల్టేజ్ పోరులో, ఒక యువ ఆటగాడు కేవలం 11 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

IPL 2026 : 11 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఎవరితడు ? కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
Priyansh Arya

Updated on: Apr 04, 2026 | 11:57 AM

IPL 2026 : క్రికెట్ అంటేనే అంచనాలకు అందని ఆట, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు నిదర్శనంగా నిలిచింది. 400లకు పైగా పరుగులు నమోదైన ఈ హై-వోల్టేజ్ పోరులో, ఒక యువ ఆటగాడు కేవలం 11 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య.

ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం బెదరకుండా 18.4 ఓవర్లలోనే 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులతో ముందుండి నడిపించగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 43 పరుగులతో రాణించారు.

సాధారణంగా ఎక్కువ పరుగులు చేసిన వారికో లేదా కీలక వికెట్లు తీసిన వారికో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కుతుంది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం 50 పరుగులు చేసిన కెప్టెన్ అయ్యర్‌ను కాదని, కేవలం 39 పరుగులు చేసిన 24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్యకు ఈ అవార్డు ఇచ్చారు. దీనికి కారణం అతను ఆడిన ఆ 11 బంతులే! 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడి లేకుండా పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు ఆర్య. అతను క్రీజులో ఉన్నంత సేపు అంటే కేవలం 4.2 ఓవర్లలోనే పంజాబ్ స్కోరు 61 పరుగులకు చేరిందంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అధ్యాపక కుటుంబం నుంచి వచ్చిన ప్రియాన్ష్ ఆర్య, బ్యాట్‌తో మాత్రం బౌలర్లకు పాఠాలు నేర్పాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫోర్, రెండో బంతికే సిక్సర్ కొట్టి తన ఉద్దేశ్యాన్ని చాటాడు. అతను చేసిన 39 పరుగులలో 36 పరుగులు కేవలం బౌండరీల (4 సిక్సర్లు, 3 ఫోర్లు) ద్వారానే రావడం విశేషం. అంటే కేవలం 3 పరుగులు మాత్రమే సింగిల్స్ రూపంలో తీశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్ల పంజాబ్ రన్ రేట్ అమాంతం పెరిగిపోయింది, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గి మ్యాచ్ సులువుగా ముగిసింది. అందుకే ఈ విజయంలో ఆర్య పాత్రను గుర్తించి నిర్వాహకులు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు.

ప్రియాన్ష్ ఆర్య ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన చిన్న ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా చెన్నై హోమ్ గ్రౌండ్‌లో సీఎస్కే బౌలర్లను అలా ఉతికి ఆరేయడం చూసి క్రికెట్ విశ్లేషకులు ఫిదా అవుతున్నారు. గతేడాది యశస్వి జైస్వాల్ చేసిన విన్యాసాలను ఆర్య గుర్తు చేస్తున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్, ఈసారి కప్పు కొట్టేలాగే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us