
India vs England, 1st Test: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 (ICC ODI Cricketer of the Year 2023)అవార్డు లభించింది. దీంతో కింగ్ కోహ్లీ నాలుగోసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇంతకు ముందు మూడుసార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. నాలుగోసారి ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా ప్రపంచ క్రికెట్లో అత్యధిక సార్లు ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో 765 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇలా చేయడం ద్వారా వన్డే ప్రపంచకప్లో ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు.
2023వ సంవత్సరపు వన్డే అవార్డు రేసులో విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ షమీ, శుభ్మన్ గిల్లు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరినీ అధిగమించిన కోహ్లి రికార్డు స్థాయిలో నాలుగోసారి ఈ ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు.
2020 నుంచి 2022 వరకు పరుగుల కరువును ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. 2023లో మళ్లీ తన పాత ఫామ్లోకి వచ్చాడు. ఏడాది తొలి నెలలో అంటే జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. నవంబర్లో 2023 ప్రపంచకప్ సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్పై తన ప్రపంచ రికార్డు 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు.
𝗜𝗖𝗖 𝗠𝗲𝗻’𝘀 𝗢𝗗𝗜 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗬𝗲𝗮𝗿 𝟮𝟬𝟮𝟯
It goes to none other than Virat Kohli! 👑🫡
Congratulations 👏👏#TeamIndia | @imVkohli pic.twitter.com/1mfzNwRfrH
— BCCI (@BCCI) January 25, 2024
2023లో మొత్తం 27 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లి మొత్తం 1377 పరుగులు చేశాడు. దీంతో 2023లో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతేడాది విరాట్ కోహ్లీ మొత్తం 6 సెంచరీలు చేశాడు. వాటిలో 3 వన్డే ప్రపంచకప్లో సాధించినవే కావడం గమనార్హం. భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో 11 మ్యాచ్లు ఆడిన విరాట్ 95 సగటుతో 765 పరుగులు చేశాడు. ఈ టోర్నీలోనే సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారీ సెంచరీ చేయడం ద్వారా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ ఫార్మాట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు.
పైన చెప్పినట్లుగా, ఈ టైటిల్ రేసులో కోహ్లి కాకుండా, టీమిండియా నుండి మరో ఇద్దరు సహచరులు ఉన్నారు. ఇందులో జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ గతేడాది వన్డేల్లో అత్యధికంగా 1584 పరుగులు చేయగా, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రపంచకప్లో 24 వికెట్లతో సహా మొత్తం 43 వికెట్లు పడగొట్టాడు. ఇతడితో పాటు న్యూజిలాండ్కు చెందిన డారిల్ మిచెల్ కూడా రేసులో ఉండగా, వారందరినీ అధిగమించి కోహ్లీ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.
రికార్డు స్థాయిలో నాలుగోసారి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును విరాట్ గెలుచుకున్నాడు. అంతకుముందు, 2012, 2018లో ఈ అవార్డును గెలుచుకున్న కోహ్లి, 2020లో ‘దశాబ్దపు వన్డే క్రికెటర్’గా ఎంపికయ్యాడు. ఓవరాల్గా కోహ్లికి ఇది 10వ ఐసీసీ టైటిల్ కాగా, ఈ విషయంలో అతనికి రెండో స్థానం దక్కింది. కోహ్లి వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం భారత జట్టుకు దూరమైనప్పటికీ, అతను త్వరలో మైదానంలోకి వచ్చి మళ్లీ పరుగులు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..