
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు పదే పదే స్లెడ్జింగ్కు దిగడం, బంగ్లాదేశ్ బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించడం మ్యాచ్లో సెగలు పుట్టించింది. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ క్రీజులో ఉన్నప్పుడు పాక్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్, ముష్ఫికర్ రహీమ్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రహీమ్, మసూద్ వైపు దూసుకెళ్లాడు. “మీ పని మీరు చూసుకోండి.. ఆటపై దృష్టి పెట్టండి” అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో మైదానంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు ఆటగాళ్లు ఒకరినొకరు వేలెత్తి చూపిస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగారు.
పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో ఫీల్డ్ అంపైర్లు వెంటనే స్పందించారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్యకు వచ్చి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ను పక్కకు తీసుకెళ్లిన అంపైర్లు, ఇలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరించారు. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంతో కూడా రహీమ్కు నచ్చజెప్పి క్రీజులోకి తీసుకెళ్లాడు. ఈ గొడవ కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి.
Tension rising in the middle as Bangladesh cross 350, a little back and forth between Mushfiqur and Shan Masood pic.twitter.com/nO2YNi8NOt
— Danish (@PctDanish) May 18, 2026
నిజానికి ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ముష్ఫికర్ రహీమ్ అద్భుతమైన సెంచరీతో (137 పరుగులు) పాకిస్తాన్ బౌలింగ్ను ముక్కలు చేశాడు. లిట్టన్ దాస్తో కలిసి అతను నెలకొల్పిన భారీ భాగస్వామ్యం కారణంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులు సాధించి, పాకిస్తాన్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
తమ సొంత గడ్డపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు చూపిస్తున్న తెగింపు, ఆధిపత్యాన్ని తట్టుకోలేకనే పాకిస్తాన్ ఆటగాళ్లు నిరాశతో ఇలాంటి స్లెడ్జింగ్కు పాల్పడుతున్నారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు ఇప్పటికే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
క్రికెట్ను ‘జెంటల్మెన్ గేమ్’ అని పిలుస్తారు, కానీ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ఇలాంటి భావోద్వేగాలు, మాటల యుద్ధాలు సహజమే అయినప్పటికీ, అవి శృతి మించకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఘర్షణపై మ్యాచ్ రెఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ జట్టు ఈ మ్యాచ్లో విజయానికి అత్యంత చేరువుగా ఉంది.