
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా కనిపించే అలంకరణకు భిన్నంగా.. ఈ గణనాథుడికి పోలీస్ టోపీ, హెల్మెట్ అలంకరించడం విశేషంగా మారింది. భక్తితో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
ట్రాఫిక్ రూల్స్పై వినాయకుడి సందేశం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, ఇందిరా చౌక్ సమీపంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించారు. విగ్రహానికి పోలీస్ టోపీ, హెల్మెట్ పెట్టడంతో ఈ వినాయకుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు.. విగ్రహం చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. “హెల్మెట్ ధరించండి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు ఈ ప్రాంతానికి వస్తుండటంతో.. ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించేందుకు ఇదొక మంచి వేదికగా మారింది.
భక్తి కార్యక్రమంతో పాటు సామాజిక బాధ్యతను మేళవించిన ట్రాఫిక్ పోలీసుల ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సైతం హెల్మెట్ ప్రాధాన్యత, రోడ్డు భద్రత సందేశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. దీంతో కామారెడ్డిలో “ట్రాఫిక్ రూల్స్ చెప్పే గణనాథుడు”గా ఈ వినాయకుడు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..