కరోనా ఎఫెక్ట్..మక్కా బంద్..
ఎక్కడో చైనాలోని వూహాన్ లో పుట్టింది..ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. వ్యాపార వాణిజ్య రంగాలను సైతం కుదేలు చేస్తోంది. ఇప్పుడు ఆ మహమ్మారి కొవిడ్ - 19 వైరస్ ప్రభావం సౌదీ అరేబియాకు కూడా తాకింది.
ఎక్కడో చైనాలోని వూహాన్ లో పుట్టింది..ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. వ్యాపార వాణిజ్య రంగాలను సైతం కుదేలు చేస్తోంది. ఇప్పుడు ఆ మహమ్మారి కొవిడ్ – 19 వైరస్ ప్రభావం సౌదీ అరేబియాకు కూడా తాకింది. దీంతో ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మసీదు, మదీనా మసీదుల సందర్శనను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది. కోవిడ్ వైరస్ విస్తరించిన దేశాలకు చెందిన యాత్రికులను ఎంత మాత్రం అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రతి నెల వేల సంఖ్యలో ముస్లిం భక్తులు ఉమ్రా దర్శనం కోసం సౌదీ వస్తుంటారు. వైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే వీసాలపై తమ దేశం వచ్చిన విదేశీయులకు తగిన వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే మక్కా సందర్శనకు అనుమతిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది హజ్ యాత్ర సందర్భంగా జూలై నెలలో ప్రపంచంలోని పలు దేశాల నుంచి ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. దీంతో అప్పటి వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయా, లేక ఎత్తివేస్తారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. మొత్తానికి తాజా నిర్ణయంతో మక్కా సందర్శకులకు ఇబ్బందిగా మారింది.