ప్రయివేటు ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారుల కొరడా.. పండుగ వేళ.. ప్రత్యేక బృందాల తనిఖీలు..
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు.
Hyderabad RTA Raids : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు. వందలాది బస్సులను చెక్ చేసిన అధికారులు రూల్స్కు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణికులతో పాటు లగేజిని కూడా రవాణా చేస్తున్న బస్సుల పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్, పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద, బెంగళూరు హైవే మార్గంలోని శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారు లు తనిఖీ చేశారు. ఎల్బీ నగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మరో ఆరు బస్సుల పై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి బస్సును ఆపి డాక్యుమెంట్లను చెకింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. రోడ్డు ట్యాక్స్ కట్టకపోవడం లగేజీ క్యారీ చేయడం పరిమితికి మించిన ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆధికారులు తెలిపారు.