
ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి అరటిపండు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అరటిపండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కిడ్నీలు బలహీనపడినప్పుడు రక్తంలో పేరుకుపోయే అదనపు పొటాషియాన్ని అవి సమర్థవంతంగా వడగట్టలేవు. దీనివల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు అమాంతం పెరిగి హైపర్కలేమియా అనే పరిస్థితి ఏర్పడి, ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా అరటిపండ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా బాగా పండిన అరటిపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. షుగర్ అదుపులో లేనివారు వీటిని రోజూ తీసుకుంటే ఇన్సులిన్ నిరోధకత పెరిగి వ్యాధి మరింత తీవ్రమయ్యే ముప్పు ఉంటుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం ఉత్తమం.

తరచూ మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు అరటిపండ్లను పరిమితం చేసుకోవాలి. అరటిపండ్లలో ఉండే టైరమిన్ అనే రసాయన సమ్మేళనం మెదడులోని రక్తనాళాలను ఒక్కసారిగా సంకోచించేలా చేస్తుంది. ఇది నరాలపై ఒత్తిడిని పెంచి మైగ్రేన్ తలనొప్పిని తీవ్రతరం చేస్తుంది. కాబట్టి తలనొప్పి లక్షణాలు ఉన్న సమయంలో వీటికి దూరంగా ఉండటమే మేలు.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. అరటిపండు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన జలుబు, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు అరటిపండ్లు తింటే శరీరంలో కఫం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వీటిని పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు.

అరటిపండ్లను తీసుకునేటప్పుడు అవి సరిగ్గా పండాయా లేదా అనేది కూడా గమనించాలి. సరిగ్గా పండని పచ్చి అరటిపండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అంత సులభంగా జీర్ణం కాదు కాబట్టి తీవ్రమైన మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి శరీర తత్వాన్ని, ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అరటిపండ్లను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.