
ఈ భూమిపై రకరకాల జంతువులు, చెట్లు, పక్షులు ఉన్నాయి. అయితే వీటిల్లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే నీళ్లు తాగే ప్రాణి ఒకటి ఉందట. అవును.. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నీరు తాగే పక్షి మన భూమిపై ఒకటి ఉందని 99 శాతం మందికి తెలియదు. ఈ పక్షి పేరు కూడా చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఈ పక్షి పేరు చాతక పక్షి. దీనినే వాన కోయిల అని కూడా అంటారు. కోకిల లాగే వీటికీ గూళ్లు కట్టడం రాదు. అందుకని వేరే గూళ్లలో గుడ్లు పెట్టేస్తాయ్. వీటిని చూసి మనం ఓర్పు, సహనం నేర్చుకోవాలి. ఇంతేనా ఇంకా దీని గురించి బోలెడన్ని సంగతులున్నాయ్..

వానాకాలంలోనే కన్పించే కోయిల జాతికి చెందిన ఈ పక్షి స్వాతి నక్షత్రంలో వచ్చే వాన చినుకులను మాత్రమే తాగుతుందట. వర్షాకాలంలో ఆకాశం నుంచి జాలు వారే మొదటి వర్షపు చుక్కను చాతక పక్షి నేరుగా తాగుతుంది. అంటే ఇది భూమిపై నదులు, కుంటలు, చెరువుల్లో నీటిని జీవిత కాలంలో ఒక్కసారి కూడా ముట్టదు.

అయితే ఈ పక్షి జలాశయాలు, నదులు, గుబురు ప్రదేశాల్లో విహరిస్తుందని ఎస్కేయూ జంతుశాస్త్ర ప్రొఫెసర్ రవిప్రసాదరావు తెలిపారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు జలాశయం వద్ద ఇవి కన్పించినట్లు ఆయన తెలిపారు.

ఈ చాతక పక్షి ఆశ, నిరీక్షణకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే ఈ పక్షి ఎల్లప్పుడూ ఆకాశం వైపు ముఖం పెట్టి వర్షం కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఈ పక్షి రంగు నలుపు, తెలుపు. దాని తలపై ఒక కోణాల చిహ్నం ఉంటుంది. అందుకే ఈ పక్షి చాలా అందంగా కనిపిస్తుంది. భారతదేశంలో వర్షాకాలం సమీపిస్తోందనడానికి చటక్ పక్షి ఒక సంకేతం. వర్షాకాలం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇది కీటకాలను తింటుంది. చాతక పక్షి వలస పక్షి. ఇది వర్షాకాలంలో ఆఫ్రికా నుంచి భారత్కి వస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత తిరిగి ఆఫ్రికాకు వెళ్లిపోతుంది.