
ఒకప్పుడు కేవలం పర్సనల్ చాటింగ్కు మాత్రమే పరిమితమైన వాట్సాప్ ఇప్పుడు.. బిజినెస్, ఆఫీస్ పనులకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో తీసుకొచ్చిన గ్రూప్ వీడియో కాల్ వంటి ఫీచర్లే దీనికి కారణంగా చెప్పవచ్చు.

ఇక వాట్సాప్ వెబ్ కూడా యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చాలా మంది యూజర్లు డెస్క్టాప్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ డెస్క్టాప్ వెర్షన్లోనూ ఎన్నో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్లో డార్క్ మోడ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్డేట్ చేయాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది.

యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్గ్రౌండ్, మెసేజ్ బబుల్స్లో కలర్ స్కీమ్, సైడ్బార్ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి, తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వాట్సాప్ ఇది వరకే 2020లో వెబ్ వెర్షన్ కోసం డార్క్ మోడ్ను విడుదల చేసింది. ఇప్పుడు ఇదే ఫీచర్ను అప్డేట్ చేస్తూ మరింత తక్కువ లైట్తో పనిచేసేలా చేయనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేష్లో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.