
స్మార్ట్ఫోన్..స్మార్ట్ఫోన్...ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ఫోనే..! ఆ ఫోన్ చేతిలో ఉంటే చాలు...ఎంటర్టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు, ఆన్లైన్ షాపింగ్ నుంచి ఆఫీస్ పనిదాకా.. ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయొచ్చు.

దీంతో రోజులో ఎక్కువ సమయంలో స్మార్ట్ఫోన్తో గడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక మంది స్మార్ట్ఫోన్ సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చీకట్లో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ను చూసి ఓ మహిళ తన కంటిచూపును పోగొట్టుకుంది. డాక్టర్ సుధీర్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నారు.

రాత్రివేళల్లో అధిక సమయం పాటు స్మార్ట్ ఫోన్ను చూసిన ఓ మహిళ కంటిచూపు కోల్పోయిన విధానాన్ని వెల్లడించారు. హైదరాబాద్లోనే బ్యూటీషియన్గా పనిచేసే 30 ఏళ్ల మహిళ తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని డాక్టర్ను సంప్రదించింది.

గతంలో బ్యూటీషియన్గా పనిచేసిన ఆమె, దివ్యాంగుడైన తన కుమారుడి కోసం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటంతో ఖాళీ సమయాల్లో స్మార్ట్ఫోన్ చూడటం అలవాటైంది. అలా రోజులో ఫోన్ వినియోగించే సమయం క్రమంగా పెరిగింది.

రాత్రిపూట ఇంట్లో లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ చూస్తుండేది. కొద్ది రోజుల్లోనే ఆమె కంటిచూపులో సమస్యలు వచ్చాయి.మహిళకు రోజులో కొన్ని సెకన్లపాటు కళ్లు కనిపించకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోవడం, వస్తువులు బ్లర్గా కనిపించడం వంటి సమస్యలు ఎక్కువ కావడంతో కంటి డాక్టర్ను సంప్రదించింది.

పరీక్షల అనంతం ఎలాంటి లోపం గుర్తించకపోవడంతో న్యూరాలజిస్ట్ను సంప్రదించాలని సూచించారు. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆమె స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్ సుధీర్.స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి ఎలాంటి మందులు వాడలేదు.

కేవలం కౌన్సిలింగ్ నిర్వహించి..అత్యవసరమైతే తప్ప స్మార్ట్ఫోన్ ఉపయోగించవద్దని ఆమెకు సూచించారు. దీంతో ఆమె కొంత కాలంపాటు స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించింది. మళ్లీ నెలరోజుల తర్వాత డాక్టర్ వద్దకు వచ్చిన ఆమెకు కంటి సమస్య పూర్తిగా తగ్గిపోయినట్లు పరీక్షల్లో తేలింది.

జీవనశైలిలో చిన్నపాటి మార్పులతో 18 నెలలుగా ఆమెను వేధిస్తున్న సమస్య నుంచి బయటపడింది.ఈ మధ్య ఎక్కువమంది ఉద్యోగులు, గృహిణులు స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ , కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు.

తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం సీవీఎస్ బారిన పడుతున్న వారిలో 66 శాతం మహిళలే ఉంటున్నారు. ఈ సమస్యలకు డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ను చూడొద్దు, రాత్రిపూట చీకట్లో మొబైల్ ఫోన్ స్క్రీన్ అత్యవసరమైతే తప్ప చూడవద్దని సూచించారు.

ఇక స్మార్ట్ఫోన్, కంప్యూటర్ చూసేవారు తప్పనిసరిగ్గా 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం తీసుకుని 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి.