
ఢిల్లీ, యూపీ వంటి ప్రాంతాలలో స్ట్రీట్ ఫుడ్గా ఎంతో ప్రజాదరణ పొందిన 'చోలే మసాలా' పూరీ మరియు చపాతీలకు సరైన జత. ఎలాంటి కాజూ పేస్ట్లు, భారీ క్రీమ్లు లేదా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే అతి తక్కువ బడ్జెట్లో నోరూరించే చోలే మసాలాను ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చోలే మసాలా తయారీకి ముందుగా ఒక అర కప్పు కాబూలీ శెనగలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.

కుక్కర్లో నానబెట్టిన శెనగలు, తోలు తీసి ముక్కలుగా కోసిన ఒక బంగాళాదుంప, తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్పై ఆరు నుండి ఏడు విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోగా ఒక చిన్న రోటిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయాక ఉడికిన బంగాళాదుంప ముక్కలను వేరు చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు కడాయిలో ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి తాలింపు వేయించాలి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రబడిన తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి కలిపి, ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేయాలి. గరిటెతో బంగాళాదుంపలను చిదుముతూ మసాలాలతో పాటు బాగా వేగనివ్వాలి.

మసాలాలు అడుగు పట్టకుండా కొద్దిగా వేడినీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. నూనె పైకి తేలిన తర్వాత ఉడికించిన కాబూలీ శెనగలు, సరిపడా ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. మసాలా అంతా శెనగలకు పట్టిన తర్వాత, శెనగలు ఉడికించిన నీటిని ఇందులో పోసి మూతపెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి.

కూర బాగా ఉడికిన తర్వాత కొన్ని శెనగలను గరిటెతో సగం మెదిపితే గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది. చివరిగా కొద్దిగా గరం మసాలా, కసూరీ మేథీ, పసిపాపలాంటి కొత్తిమీర తరుగు చల్లుకుని దింపేస్తే ఎంతో రుచికరమైన చోలే మసాలా సిద్ధమవుతుంది. వేడివేడి పూరీ లేదా చపాతీలతో తింటే ఈ రుచిని ఎప్పటికీ మరచిపోలేరు.