
ప్రస్తుతం టీమిండియా యుఎఇలో ఆసియా కప్ ఆడుతోంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.

ఇంగ్లాండ్లో జరిగే కౌంటీ ఛాంపియన్షిప్లో చివరి రెండు రౌండ్లలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. కౌంటీ క్రికెట్లో హాంప్షైర్ తరపున ఆడనున్నాడు. ఈ సమాచారాన్ని హాంప్షైర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేయడం ద్వారా ప్రకటించింది.

సెప్టెంబర్ 15 నుండి 18 వరకు టౌంటన్లోని కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్లో హాంప్షైర్ సోమర్సెట్తో తలపడుతుంది, తర్వాత సెప్టెంబర్ 24 నుండి 27 వరకు యుటిలిటీ బౌల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ సర్రేతో తలపడుతుంది. సుందర్ ఈ రెండు మ్యాచ్లలో భాగం అవుతాడు.

వాషింగ్టన్ సుందర్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో ఆడాడు. ఈ సిరీస్లో అతను 47 సగటుతో 284 పరుగులు చేశాడు, ఇందులో ఓల్డ్ ట్రాఫోర్డ్లో అతని తొలి సెంచరీ కూడా ఉంది. సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు.

2022 తర్వాత సుందర్ కౌంటీ క్రికెట్లో ఆడటం ఇదే తొలిసారి. గతంలో కౌంటీ ఛాంపియన్షిప్, వన్డే కప్లో లాంక్షైర్కు ప్రాతినిధ్యం వహించాడు. నార్తాంప్టన్షైర్తో జరిగిన తన తొలి మ్యాచ్లో ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు 13 టెస్టుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు, 44.2 సగటుతో 752 పరుగులు చేశాడు, అందులో 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 28.5 సగటుతో 32 వికెట్లు కూడా పడగొట్టాడు, ఇందులో మూడు ఫోర్-వికెట్లు, ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది.