పూజ గది స్థానం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కులో పూజ గది ఉండడమే శ్రేయస్కరం. ఈ దిశలోనే పూజగది ఉంటే ఇంట్లో సుఖశాంతులు, శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ దిశలో పూజగది పొరపాటున కూడా ఉంచకూడదు. ఆ వైపు పూజ గది ఉంటే.. ఉన్న ఇంటికి ఆర్థికారోగ్య నష్టం కలిగే అవకాశం ఉందంట.
నెమలి ఈక: శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
శాలిగ్రామం: పరమ శివుడిని లింగాకారంలో పూజించిన మాదిరిగానే.. శ్రీమహావిష్ణువును శాలిగ్రామంగా పూజిస్తారు. ఆ కారణంగా శాలిగ్రామాన్ని పూజా స్థలంలో ఉంచడం చాలా శ్రేయస్కరం. తన భర్తను పూజాగదిలో ప్రతిష్టించి పూజిస్తే.. లక్ష్మిదేవి ప్రసన్నం కలుగుతుందని నమ్మకం.
శంఖం: ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం కూడా పేర్కొంటోంది.
గంగాజలం: హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర నదీజలం ఎప్పుడూ చెడిపోదని నమ్మకం, పైగా నిరూపితం కూడా. ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచడానికి కారణం ఇదే. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి సంతోషిస్తుందని నమ్మకం.