భారతదేశం ప్రపంచంలోనే భిన్నమైన దేశం. పూజలు, పండగలు, ఉపవాసాలు చేయడమే కాదు.. పవిత్ర స్థలాలను, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..
గయ: హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన స్థలం. గయాసురుడు అనే మహా భక్తుడైన రాక్షసుడు పేరు మీదుగా ఏర్పడిన నగరం. బోధ్ గయ లేదా బుద్ధ గయ అనేది భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలోని ఒక నగరం. ఇది గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. బుద్ధుని జీవితంతో ముడిపడి ఉన్న నాలుగు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ యాత్రికులు ఇక్కడికి వస్తారు.
రిషికేశ్ ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది. దీనిని ప్రపంచ యోగా రాజధాని అని పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు ఈ క్షేత్రానికి వస్తారు. ముఖ్యంగా యోగా, ధ్యానం నేర్చుకోవడానికి. ఈ ప్రశాంతమైన నగరం ప్రపంచం నలుమూల్లో ఉన్న ఆధ్యాత్మిక ప్రియులను ఆకర్షిస్తుంది. లక్షలాది మంది ఇక్కడికి వస్తారు.
హరిద్వార్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పవిత్ర గంగా నది దిగువన ఉంది. తీర్థయాత్ర స్థలాలకు ప్రవేశ ద్వారంగా ఖ్యాతిగాంచింది. హరిద్వార్లోని గంగా నది అత్యంత పవిత్రం అని.. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
తిరువణ్ణామలై: తమిళనాడులో ఉన్న తిరువణ్ణామలై గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన ప్రదేశంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. శివుడికి అంకితం చేయబడిన అరుణాచలేశ్వర ఆలయం ఉన్న తిరువణ్ణామలై.. పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఐదు పవిత్ర స్థలాలలో అగ్ని క్షేత్రంగా పిలువబడుతుంది. పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా కృత్తిక దీపం రోజున భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.
మధుర- బృందావనం: ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావన్ జంట నగరాలు కృష్ణ భక్తులకు పవిత్ర స్థలాలు. కృష్ణుడి జన్మస్థలం మధుర, ఆయన బాల్యంలో దైవిక లీలలు చేస్తూ గడిపిన బృందావనం కృష్ణ భక్తికి కేంద్రాలు. ఆధ్యాత్మికంగా మనశాంతిని కోరుకునే వారికి బంకే బిహారీ ఆలయం, బృందావనంలోని ఇస్కాన్ ఆలయం వంటి దేవాలయాలు మంచి గమ్యస్థానాలు.
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని. ఇది ఆధ్యాత్మిక భక్తులు తమ పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేసే ప్రదేశంగా నమ్ముతారు. వారణాసి వివిధ దేవతలతో ఉన్న సంబంధానికి, మరణించిన ఆత్మలకు మోక్షం (ముక్తి) పొందే ప్రదేశంగా గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కన్యాకుమారి: దక్షిణ భారత దేశంలో తమిళనాడులో ఉన్న కన్యాకుమారి భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం సంగమించే ప్రదేశం మధ్య ఉన్న స్వామి వివేకానందకు అంకితం చేయబడిన వివేకానంద రాక్ మెమోరియల్, ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు ఒక దీపస్తంభంగా నిలుస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటానికి పర్యాటకులు అక్కడకు తరలివస్తారు. కన్యాకుమారి దేవికి అంకితం చేయబడిన ఆలయం కూడా ఉంది.