
మొదట మూడు కట్టల తాజా గంగవల్లి కూరను తీసుకోండి. లేత కాడలు ఉంటే ఉంచేయండి, ముదురుగా ఉంటే మాత్రం తీసేసి ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బాణలిలో రెండు మూడు స్పూన్ల నూనె వేసి, ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక.. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేయండి. ఇక్కడే దంచిన వెల్లుల్లి రెమ్మలు, తుంచిన కరివేపాకు వేస్తే వచ్చే ఆ సువాసన వంటగది అంతా నిండిపోతుంది! ఉల్లిపాయలు వేగాక ఆకుకూర వేసి, మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఆకులో ఉండే నీరు బయటకు వచ్చి అది మెత్తగా ఉడికినప్పుడు నాలుగు పండిన టమాటా ముక్కలు కూడా కలపండి.

టమాటా మెత్తగా ఉడికేలోపు, పక్కన వేరే మూకుడులో రెండు స్పూన్ల శెనగపిండిని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇదే మన సీక్రెట్ ఇంగ్రిడియంట్! చివరగా కూరలో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడితో పాటు మనం వేయించిన శెనగపిండిని వేసి కలపండి.

ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచితే, ఆ మసాలాలన్నీ ఆకుకూరకు పట్టి నూనె పైకి తేలుతుంది. లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి గంగవల్లి కూర రెడీ!ఈ గంగవల్లి కూరను అన్నంలోకైనా, చపాతీలోకైనా ట్రై చేయండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి వేడి వేడి కూర, నెయ్యి వేసుకుని తింటే ఆ తృప్తే వేరు.

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి అని అందరికీ తెలుసు, కానీ ఇలా రుచిగా చేస్తే అది శరీరానికే కాదు, మనసుకి కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ ఎంత తృప్తి గా తింటారో మీరే చూడండి! ఆ పచ్చని కూర, తెల్లని అన్నం.. పక్కన ఒక పప్పు చారు ఉంటే అది నిజంగా రాజభోజనమే!