
TDP Chief Chandrababu Naidu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 52 రోజుల కారాగార జీవితం తర్వాత ఆయన జైలు నుంచి బయటకొచ్చారు.

చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతల రాకతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9న అరెస్టు అయ్యారు. అదే రోజు రాత్రి ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మంగళవారం ఉదయం ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చారు.

సుధీర్ఘ వాదనల అనంతరం చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇందుకు ఐదు సాధారణ షరతులు విధించింది.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో చేసిన ఆరోగ్య పరీక్షలు, వైద్యుల నివేదికలు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల లేఖలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావు 15 పేజీల తీర్పులో ప్రస్తావించారు.

పిటిషనర్ చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మానవీయ దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు. అదే సమయంలో న్యాయప్రక్రియ నుంచి పిటిషనర్ తప్పించుకుంటారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పు కాపీలో న్యాయమూర్తి వెల్లడించారు.