
పెళ్లయినా, షష్టిపూర్తి వేడుకైన అట్టహాసంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ధనవంతులు షష్టిపూర్తి వేడుకను తన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు అందరిని ఆహ్వానించి అబ్బో అనిపించేలా చేసుకోవడం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం.. కానీ కడు పేదరికం..రోజు కూలితో పూట గడుపుకునే దంపతుల షష్టిపూర్తి ఎలా ఉంటుందో ఊహించగలమా..! అసలు అలాంటి పేదలకు షష్టిపూర్తి చేసుకోవాలనే ఆలోచన వస్తుందా..!

మహబూబాబాద్ జిల్లాలో ఉపాధిహామీ కూలి దంపతుల షష్టిపూర్తి వేడుక వినూత్న రీతిలో జరిగింది.పని ప్రదేశంలో తోటి కూలీలే బంధుమిత్రులు, అతిధులు అయ్యారు. అక్కడ పచ్చని చెట్లే కళ్యాణ మండపం అయింది.వారికి వినూత్న రీతిలో షష్టిపూర్తి వేడుక నిర్వహించి మురిసి పోయేలా చేశారు. ఈ వినూత్న షష్టిపూర్తి వేడుక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో జరిగింది.

సాధారణంగా షష్టిపూర్తి వేడుకలంటే కల్యాణ మండపాల్లో, బంధుమిత్రుల కోలాహలం మధ్య జరుపుకోవడం చూస్తుంటాం. కానీ, అందుకు పూర్తి భిన్నంగా నిరుపేద శ్రమజీవుల మధ్య, తాము నిత్యం పనిచేసే ఉపాధి హామీ క్షేత్రంలోనే షష్టిపూర్తి వేడుకలు జరుపుకుని ఆదర్శంగా నిలిచారు దంపతులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (MGNREGS) పని స్థలంలో ఆకుతోట జయమ్మ, సోమయ్య దంపతుల షష్టిపూర్తి (60 ఏళ్లు నిండిన సందర్భంగా జరుపుకునే వేడుక) ఘనంగా జరిగింది.. తోటి కూలీలే అతిథులు.. పారలే అక్షింతలు అయ్యాయి..

జయమ్మ, సోమయ్య దంపతులు ప్రతిరోజూ ఇతర కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సోమయ్యకు 60 ఏళ్లు నిండడంతో, తమతో పాటు ప్రతిరోజూ చెమటోడ్చే తోటి కూలీల సమక్షంలోనే ఈ వేడుక నిర్వహించారు..నూతన వస్త్రాలతో కూలీ పనికి వచ్చిన దంపతులను తోటి ఉపాధి హామీ కూలీలందరూ కలిసి ఈ దంపతులను ఒకచోట కూర్చోబెట్టి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.షష్టిపూర్తి సందర్భంగా దంపతులు తోటి కూలీలకు మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. కూలీలందరూ ఆ దంపతులు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవెనలు అందించారు.

ఆదర్శంగా నిలిచిన వేడుక "పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలకు పోకుండా, నిత్యం మాతో కలిసి కష్టపడే తోటి కూలీల మధ్య ఈ వేడుకను జరుపుకోవడం తమకు ఎంతో తృప్తినిచ్చింది" అని ఆకుతోట సోమయ్య, జయమ్మ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. డబ్బు ఖర్చు చేసి ఆర్భాటంగా చేసుకునే వేడుకల కంటే, శ్రమను నమ్ముకున్న తోటి కూలీల మధ్య ఎంతో ఆత్మీయంగా ఈ షష్టిపూర్తిని నిర్వహించడం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ వినూత్న వేడుక చర్చగా మారుతుంది.