
రోడ్డు పక్కన చిన్న బండిపై కూడా ప్లేట్ టిఫెన్ రూ.30 నుంచి రూ.40 ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టిఫిన్ కేవలం రూ.5 అంటే హైదరాబాద్ వాసులు ఎగిరిగంత్తేస్తారు. ఇంతకీ ఈ రూ.5 టిఫిన్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్లలో రూ.5 లకే మధ్యాహ్నం భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు రూ.5 లకే టిఫిన్ కూడా అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది.

ఇందిరమ్మ క్యాంటీన్ల ద్యారా రూ.5కే టిఫిన్ అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్ పరిధిలోని 150 కేంద్రాల్లో త్వరలో రూ.5కే టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలా ఐదు రూపాయలకు అందించే టిఫిన్కి వాస్తవంగా రూ.19 ఖర్చు కానుండగా.. ఈ మొత్తంలో రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి మిగతా రూ.5 వసూలు చేస్తారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో ప్రతి రోజు ఉదయం 7-10 గంటల మధ్య రూ.5కే ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ, వడ వంటి వాటితో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు.

దీన్ని అమలు చేయడం కోసం ఇప్పటికే ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఆధునీకరిస్తున్నారు. మొత్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు రూ.11.43 కోట్లు ఖర్చు కానుండగా.. జులై, ఆగస్టు రెండు నెలల వ్యవధిలో మూడు విడతల్లో ఈ మొత్తం విడుదల చేయాలని భావిస్తున్నారు.