
బాదం పప్పులను 'సూపర్ ఫుడ్' అని అంటారు. వీటిలో విటమిన్ E, మాంగనీస్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 60 గ్రాముల కంటే ఎక్కువ బాదం తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుందని తేలింది.

ఎక్కువ బాదంతో లాభం: 'ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్' లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 60 గ్రాముల కంటే ఎక్కువ బాదం తింటే, వారి శరీరంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడికి సంబంధించిన బయోమార్కర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా డీఎన్ఏ రక్షణ మెరుగుపడుతుంది.

ఆక్సీకరణ ఒత్తిడి అంటే..?: శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులు పేరుకుపోయినప్పుడు ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇవి కణాలను దెబ్బతీసి, వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు,యాంటీఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాలను రక్షిస్తాయి.

ధూమపానం చేసేవారిపై: ఈ అధ్యయనంలో భాగంగా ధూమపానం చేసేవారిని రోజుకు 84 గ్రాముల బాదం తినమని సూచించారు. వారిలో ఆక్సీకరణ డీఎన్ఏ నష్టం 28 శాతం, లిపిడ్ పెరాక్సిడేషన్ 34 శాతం, డీఎన్ఏ స్ట్రాండ్ బ్రేక్లు 23 శాతం తగ్గినట్లు ఫలితాలు చూపించాయి. అధిక ఒత్తిడి పరిస్థితులలో కూడా బాదం తినడం ప్రభావవంతంగా ఉంటుందని ఈ ఫలితాలు నిరూపించాయి.

తక్కువ బాదం తినడం కూడా మంచిదే అయినా ప్రతిరోజూ 60 గ్రాములు తింటే దాని ప్రభావం మరింత మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారించడంలో, కణాలకు శక్తిని అందించడంలో సహాయపడతాయి. అయితే దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.