
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధించి మరో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో మూడో నంబర్లో వచ్చిన కింగ్ కోహ్లి తుఫాన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.

రోహిత్ శర్మతో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లి 61 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 56 పరుగులు చేసి గ్లెన్ మాక్స్ వెల్కు వికెట్ అప్పగించాడు.

ఈ 56 పరుగులతో వన్డే క్రికెట్లో అత్యధిక 50+ స్కోరు సాధించిన బ్యాట్స్మెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. టాప్-3లో కనిపించిన 2వ భారతీయుడిగా కూడా నిలిచాడు.

అంతకు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 3వ స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 365 ఇన్నింగ్స్లలో 112 సార్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.

ఇప్పుడు కింగ్ కోహ్లి కేవలం 269 ఇన్నింగ్స్ల్లోనే 113 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో వన్డే క్రికెట్లో అత్యధికంగా 50కిపైగా స్కోర్లు సాధించిన బ్యాట్స్మెన్ల జాబితాలో రికీ పాంటింగ్ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్గా పేరుగాంచిన లిటిల్ మాస్టర్ 452 ఇన్నింగ్స్లలో 145 సార్లు 50+ స్కోర్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

రెండో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కుమార సంగక్కర 380 ఇన్నింగ్స్ల్లో 118 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.

ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ రెండో స్థానానికి వెళ్లాలంటే కేవలం ఆరు 50+ స్కోర్లు మాత్రమే కావాలి. తద్వారా రానున్న వన్డే ప్రపంచకప్లో కింగ్ కోహ్లీ బ్యాట్ నుంచి మరో రికార్డును ఆశించవచ్చు.