
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్మన్ గిల్ 12 పరుగుల వద్ద అవుటవ్వగా, తిలక్ వర్మ సున్నాకే పెవిలియన్ చేరాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరో బ్యాటర్ యశస్వీ జైస్వాల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో మెరిశాడు. ఈ క్రమంలో ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ జైస్వాల్ 41 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత మైదానంలో మెరుపులు కురిపించిన సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా కేవలం 55 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో తుఫాన్ సెంచరీ పూర్తి చేశాడు.

దీంతో పాటు టీ20 క్రికెట్లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీ చేసిన రోహిత్ శర్మ రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. టీ20 క్రికెట్లో హిట్మన్ 4 సెంచరీలు చేశాడు.

ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా టీ20 క్రికెట్లో 4 సెంచరీలు చేయడం ద్వారా రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును సమం చేశాడు.

అంతే కాకుండా అతి తక్కువ టీ20 ఇన్నింగ్స్ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా కూడా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు గ్లెన్ మాక్స్వెల్ పేరిట ఉండేది.

గ్లెన్ మాక్స్వెల్ 92 ఇన్నింగ్స్ల ద్వారా 4 టీ20 సెంచరీలు చేశాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే 4 అద్భుత సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

సూర్యకుమార్ యాదవ్ (100) సెంచరీతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను కుల్దీప్ దెబ్బ తీశాడు. దీంతో ఆ జట్టు కేవలం 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.