నాగ్పూర్ టెస్ట్ కంటే ముందే టీ20, వన్డేలలో నెం.1 గా ఉన్న భారత్.. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ భారత్ను నెం.1 స్థానంలో నిలిపిన టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అవతరించాడు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 115 రేటింగ్ పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు 111 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ జట్టు మూడో స్థానంలో ఉంది.
అదే సమయంలో ఆస్ట్రేలియా మళ్లీ నెం.1 స్థానానికి రావాలంటే భారత్లో జరిగే టెస్ట్ సిరీస్ గెలవాల్సిందే. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 2-1తో గెలిచినా కూడా మళ్లీ టెస్టుల్లో నెం.1 జట్టుగా అవతరిస్తుంది. లేదా ఈ సిరీస్ డ్రా అయితే, భారత్ నెం.1 స్థానంలోనే కొనసాగుతుంది.
అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలోనే కాక ఇతర విభాగాలలో కూడా టీమిండియా ప్లేయర్లు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.
వన్డే ఫార్మాట్లో మొహమ్మద్ సిరాజ్ ఐసీసీ నెం.1 బౌలర్గా ఉన్నాడు. సిరాజ్ కేవల 21 వన్డేలకే ఈ ఘనత సాధించడం ఇక్కడ చెప్పుకోదగిన మరో విశేషం.
ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ ద్వారా ‘మిస్టర్ 360’ గా అవతరించిన సూర్య కుమార్ యాదవ్ కూడా.. పొట్టి క్రికెట్లో నెం.1 బ్యాట్స్మ్యాన్గా ఉన్నాడు.
మరోవైపు టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా అయితే గత కొన్ని నెలలుగా ఐసీసీ ర్యాకింగ్స్లో నెం.1 టెస్ట్ ఆల్రౌండర్గా తిష్ట వేసుకుని కూర్చున్నాడు. గాయం కారణంతో కొంత కాలంగా క్రికెట్కు దూరమైన జడ్డూ.. నాగ్పూర్ టెస్ట్లో బ్యాటింగ్, బౌలింగ్తో చెలరేగాడు.
ప్రపంచ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో భారత్ నెం.1 స్థానాన్ని అందుకోవడంతో.. టీమిండియాపై మాజీలు, క్రీడాభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.