లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఐపీఎల్ 2022లో తొలి సెంచరీ సాధించాడు. కోల్కతా నైట్ రైడర్స్పై డి కాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో అతని IPL కెరీర్లో రెండవ సెంచరీని నమోదు చేశాడు. దీంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.
మే 18, బుధవారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, మొదట బ్యాటింగ్కు వచ్చిన లక్నో జట్టులో ఓపెనర్ డి కాక్ కేవలం 59 బంతుల్లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. అంతకుముందు 2016లో ఢిల్లీ తరపున సెంచరీ సాధించాడు.
డి కాక్ కేవలం 70 బంతుల్లో 140 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ సమయంలో అతను 10 ఫోర్లు, 10 సిక్సర్లు కూడా బాదేశాడు. విశేషమేమిటంటే సెంచరీ పూర్తి చేసిన అతను 19వ ఓవర్లో టిమ్ సౌథీపై వరుసగా 3 సిక్సర్లు, ఆపై 20వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్పై 4 ఫోర్లు బాదాడు.
ఈ సెంచరీతో లక్నో తరపున సెంచరీ చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. అతని కంటే ముందు ఈ సీజన్లో కెప్టెన్ రాహుల్ 2 సెంచరీలు చేశాడు. అదే సమయంలో, ఐపీఎల్ 2022లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్మెన్గా డి కాక్ నిలిచాడు. అతని కంటే ముందు జోస్ బట్లర్, రాహుల్ ఈ అద్భుతం చేశారు.
అంతే కాదు రాహుల్తో కలిసి డికాక్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును కూడా సృష్టించాడు. వీరిద్దరూ ఔట్ అవ్వకుండానే 20 ఓవర్లలో 210 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక జట్టు 20 ఓవర్లు పూర్తి చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా బ్యాటింగ్ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.