
ఐపీఎల్లో ఫ్రాంఛైజీలు భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకుని పలువురు ఆటగాళ్లపై వేలంలో కాసుల వర్షం కురిపిస్తుంటారు. ఐపీఎల్-2023 మినీ వేలంలో కూడా అదే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్.. తమ ఖజానాలో నుంచి అత్యధిక మొత్తాన్ని నలుగురి ఆటగాళ్లపై వెచ్చించారు. అయితే ఆ నలుగురు కూడా మొదటి మ్యాచ్లోనే తుస్సుమనిపించారు.

ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ కోసం ముంబై రూ. 17.5 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఆల్రౌండర్ తన తుఫాను బ్యాటింగ్, పదునైన బౌలింగ్కు పెట్టింది పేరు. జట్టుకు అద్భుతంగా ఉపయోగపడతాడని అనుకున్నారు. అయితే తొలి మ్యాచ్లోనే గ్రీన్ విఫలమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై IPL అరంగేట్రం చేసిన గ్రీన్ కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అటు బౌలింగ్లో రెండు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అతడి విఫలంలో అత్యధిక ప్రైస్ ట్యాగ్ కచ్చితంగా కనిపిస్తోందని చెప్పాలి.

ఇంగ్లాండ్కు చెందిన హ్యారీ బ్రూక్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిని జట్టులో చేర్చడంతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంటుందని హైదరాబాద్ ఫ్రాంచైజీ భావించింది. అయితే తొలి మ్యాచ్లో బ్రూక్ ప్రభావం చూపించలేకపోయాడు. ఈ డాషింగ్ బ్యాట్స్మెన్ రాజస్థాన్పై 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ను చెన్నై కొనుగోలు చేసింది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఈ ఫ్రాంచైజీ.. సదరు ఆటగాడి కోసం రూ. 16.25 కోట్లు ఖర్చు చేసింది. అయితే తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై స్టోక్స్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక అటు స్టోక్స్ సీజన్ మొత్తం బౌలింగ్ చేయడు. దీంతో రానున్న మ్యాచ్ల్లో స్టోక్స్ ఏమాత్రం ప్రభావం చూపుతాడో వేచి చూడాలి.

ఇక ఈ ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కర్రన్. అతడిని పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్, స్టోక్స్, బ్రూక్లతో పోలిస్తే, కర్రన్ ఈ సీజన్ మొదటి మ్యాచ్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్తో 26 పరుగులు.. బంతితో 38 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.