
Indian Cricket Team: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంతో టీమిండియా చారిత్రక రికార్డు సృష్టించడం విశేషం.

టెస్టు క్రికెట్లో తొలి మ్యాచ్లో ఓడి ఆ తర్వాత 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రత్యేక రికార్డు ఉంది. ఇంతకుముందు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి అరుదైన ఫలితాలు 3 సార్లు మాత్రమే వచ్చాయి.

1897-98, 1901-02లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయి, ఆ తర్వాత రెండుసార్లు 4-1 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. ఆ తర్వాత 1912లో ఇంగ్లండ్ జట్టు ఇలాంటి ఘనత సాధించింది.

ఇప్పుడు వరుసగా 112 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టును 4-1 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. దీంతో తొలి మ్యాచ్లో ఓడి 4-1తో సిరీస్ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ప్రపంచంలో మూడో జట్టుగా నిలిచింది.

కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో టీమ్ ఇండియా ఇలాంటి అరుదైన రికార్డును లిఖించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ (తొలి మ్యాచ్ ఆడాడు), అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత్ 4-1తో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ అపూర్వ విజయాన్ని నమోదు చేసిన రోహిత్ సేన.. సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం.